Monday, August 29, 2011

ఇవాళ తెలుగు భాషా దినోత్సవం

* మాతృభాషను మరవొద్దంటూ ప్రచారం

భావవ్యక్తీకరణలో భాష అత్యంత ముఖ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు ఒకట్రెండు భాషల ఆధిపత్యమే నడుస్తున్నా.. ఎవరికి వారికి మాతృభాషపై ఉన్న మమకారం ప్రత్యేకమైందే. ఇలా మాతృభాష గురించి చెప్పేటప్పుడు మన తెలుగు గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాలి.

ఎందుకంటే, మాటకైనా.. పాటకైనా మన శైలిలో ఉన్న ప్రత్యేకతే వేరు. ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. అమ్మలా కమ్మనైనది.. మాధుర్యంలో అమృతానికి మించినది.. ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌గా గుర్తింపు పొందింది.. ఇలా మన తెలుగు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అచ్చతెలుగు నుడికారాలు, ఛందస్సులు, పద ప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాలవారీగా యాసలు... మొత్తంమీద మన తెలుగు నిజంగా వెలుగు భాషే. ద్రవిడ భాషల్లోకెల్లా మన అక్షర మాలది ప్రత్యేకమైన గుర్తింపు. దేశ భాషలందు తెలుగులెస్స..అన్నారు.. శ్రీకృష్ణ దేవరాయలు. అలా అనడమే కాదు.. మన తెలుగు గొప్పదనం దశదిశలా చాటేందుకు తన వంతు కృషి చేశారు. ఆదికవి నన్నయ మొదలు.. ఈకాలం ప్రముఖుల వరకూ ఎందరో మహానుభావులు మాతృభాష గొప్పదనాన్ని మరింత ఇనుమడింప చేశారు.

మన భాషలో, భావనలో.. మన సంస్కృతిలో, సంప్రదాయంలో అన్నింట్లోనూ తెలుగే. అలాంటి తెలుగు భాషాభ్యున్నతి కోసం ఎనలేని సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఇవాళ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వాడుక భాషలో భోధన జరగాలంటూ.. రామ్మూర్తి పంతులు ఉద్యమించారు. దాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు. వ్యవహారిక భాషా పితామహుడిగా కీర్తి గడించారు.

ఇలా తెలుగు వెలుగు కోసం.. ఓ చిలకమర్తి, ఓ గురజాడ, ఓ కందుకూరి వీరేశలింగం వంటి ఎందరో మహానుభావులు కృషి చేశారు. ఆంధ్రులైన మనమే కాదు.. తెల్లదొరలు సైతం మన భాషను చూసి మురిసిపోయారు. CP బ్రౌన్ లాంటి మహాశయులు.. తెలుగు భాష వ్యాప్తికి తమ వంతు చేయూతనందించారు. తెలుగును భారత ప్రభుత్వం కూడా ప్రాచీన భాషగా కూడా గుర్తించింది.

అయితే ప్రపంచకీరణ నేపథ్యంలో ఆంగ్ల విద్య వ్యామోహంలో పడి ఇప్పుడు తెలుగును చిన్నచూపు చూస్తున్నారు. ఈ పరిణామం సాహితీ వేత్తల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎంతో ఘనచరిత్ర ఉన్న మన తీయనైన తెలుగును పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని, తెలుగు భాషను కాపాడుకోవాలని పలువురు భాషా వేత్తలు పిలుపిస్తున్నారు.



No comments:

Post a Comment

Oosaravelli